ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వైరల్ వీడియోలు, ఫొటోల సంఖ్య పెరిగింది. ఇటీవల ఫ్లయింగ్ దోశ, ఫ్లయింగ్ వడా పావ్ వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. పాతదే అయినప్పటికీ నెటిజన్లు ఆ వీడియోను ఎక్కువగా వీక్షిస్తున్నారు.
ముంబైలోని మలద్ అనే ప్రాంతంలో ఎన్ఎల్ కాలేజీ సమీపంలో ఓ వ్యక్తి సైకిల్పై తిరుగుతూ దోశలు వేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి అక్కడ సైకిల్ దోశ వాలా అని పేరుంది. అలా అతను 25 ఏళ్లుగా దోశలు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సైకిల్ వెనుక స్టాండ్ మీద ఒక పెనం ఉంటుంది. దానిపై అడిగిన వాళ్లకు వెంటనే దోశ వేసి ఇస్తాడు. ఇక దోశలోకి కావల్సిన పదార్థాలు కూడా సైకిల్ మీదే ఉంటాయి. అతను వేసే దోశలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అందుకనే చాలా మంది స్థానికులు అతని వద్ద దోశలను తింటుంటారు. ఇక దోశ రకాన్ని బట్టి రూ.60 నుంచి రూ.100 వరకు తీసుకుంటాడు.
అయితే అతని వీడియో వైరల్ అయ్యే సరికి చాలా మంది స్పందిస్తున్నారు. సైకిల్ పై తిరుగుతూ అంత కష్టపడుతున్న అతనికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అతను ఎక్కడ ఉంటాడో చెప్పాలని కోరుతున్నారు. అతని వీడియో వైరల్ అవుతుండడంతో అతనికి సహాయం చేసేందుకు చాలా మంది ఆసక్తిగా అతని గురించి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఆ సైకిల్ దోశ వాలా జీవితం మారుతుందా, లేదా.. అనేది చూడాలి.