సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు వైరస్ లు, మాల్వేర్లను సృష్టిస్తూ ఫోన్ల ద్వారా వ్యాప్తి చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో యూజర్ల డేటా చోరీకి గురవుతోంది. తాజాగా కొందరు హ్యాకర్లు మళ్లీ విజృంభించారు. నెట్ఫ్లిక్స్ను 2 నెలల పాటు ఉచితంగా అందిస్తున్నారని చెప్పి మోసం చేస్తున్నారు. మాల్వేర్ను వ్యాప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ యూజర్లకు ఒక మెసేజ్ వస్తోంది. కరోనా లాక్డౌన్ వల్ల నెట్ఫ్లిక్స్ ను 2 నెలల పాటు ఉచితంగా అందిస్తున్నారని, కనుక తాము అందించే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే నెట్ఫ్లిక్స్ను ఉచితంగా ఉపయోగించవచ్చని మెసేజ్లో ఉంటోంది. ఇది నిజమే అని నమ్మేవారు ఆ మెసేజ్లలో ఇచ్చిన ఫ్లిక్స్ ఆన్లైన్ అనే యాప్ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దీన్ని డౌన్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే యూజర్లను పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్లు ఇచ్చిన వెంటనే యూజర్కు చెందిన వాట్సాప్లోని కాంటాక్ట్లకు ఆటోమేటిగ్గా మెసేజ్ లు వెళ్తాయి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మెసేజ్లలో ఉంటుంది. దీంతోపాటు యూజర్లకు చెందిన డేటా కూడా చోరీ అవుతోంది.
దీన్ని గమనించిన సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అంతా ఫేక్ అని, ఆ యాప్ను ఎట్టి పరిస్థితిలోనూ డౌన్లోడ్ చేసుకోవద్దని, లేదంటే డేటా చోరీకి గురవుతుందని, అలాగే ఫోన్లో మాల్వేర్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరిస్తున్నారు. కనుక ఎవరైనా సరే.. ఇలాంటి మెసేజ్లు వస్తే స్పందించకండి. లేదంటే ఎంతో విలువైన మీ డేటా చోరీ అవడమే కాక, మీ ఫోన్లో మాల్వేర్ వ్యాప్తి చెందుతుంది.