కరోనా వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఆహారం లభించడం లేదు. దీంతో వారు ఆహారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఆహారం దొరక్క రోడ్లపై అవస్థలు పడుతూ కనిపిస్తున్నారు. అయితే ఓ ఇద్దరు నిరుపేద చిన్నారులు కూడా ఆ పోలీస్ కానిస్టేబుల్కు అలాగే కనిపించారు. దీంతో చలించిపోయిన అతను తన బాక్స్లోని ఆహారాన్ని వారికి ఇచ్చేశాడు.
పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.మహేష్ కుమార్ సోమవారం రాత్రి నగరంలోని మోనప్ప ఐల్యాండ్ జంక్షన్లో రహదారిపై నిరాశ్రయులుగా ఉన్న ఓ వ్యక్తి, అతని ఇద్దరి చిన్నారులను చూశాడు. అయితే వారు మహేష్కు రోజూ కనిపిస్తూనే ఉన్నారు. కానీ సోమవారం రాత్రి కూడా వారు కనిపించడంతో ఆ వ్యక్తిని పరిస్థితి ఏమిటని విచారించాడు. దీంతో అతను తన వద్ద డబ్బులు ఉన్నాయి కానీ షాపులు మూసి ఉన్నాయని, పిల్లలకు ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారని తెలిపాడు.
దీంతో చలించిపోయిన మహేష్ కుమార్ రాత్రి తినేందుకు తాను ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్ నుంచి ఆహారాన్ని తీసి ఆ పిల్లలకు పెట్టాడు. పక్కనే ఉన్న ఓ హాస్పిటల్లో పేపర్ ప్లేట్లను తీసుకుని వాటిల్లో అతను తన బాక్సులోని భోజనాన్ని పెట్టాడు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో మహేష్ కుమార్ను అందరూ అభినందిస్తున్నారు. ఇక హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కానిస్టేబుల్ మహేష్ ను ప్రశంసించారు. అతనికి సన్మానం చేశారు.