కరోనా ఎంతోమంది చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. పొత్తిళ్లలోనే తల్లిని పోగొట్టుకొని ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ విధంగానే కరోనా సోకిన తల్లి మృతి చెందగా… అప్పుడే పుట్టిన బిడ్డ ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బిడ్డకు కేవలం ఫార్ములా పాలు కాకుండా తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తల్లులు తమ మానవతా హృదయంతో తమ చనుబాలను ఆ పసిబిడ్డకు తాపించి బిడ్డ ప్రాణాలను కాపాడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర నాగపూర్ లోని కింగ్స్వే హాస్పిటల్లో మినాల్ వెర్నేకర్ అనే 32 సంవత్సరాల గర్భిణీ మహిళ కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. అత్యవసర పరిస్థితులలో ఆమెకు సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమంలోనే తల్లికి గుండెల్లో నొప్పి రావడంతో మృతి చెందింది. నెలలు పూర్తి కాకనే శిశువు జన్మించడంతో అతనికి ఫార్ములా పాలు తాపించడంతో అలర్జీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న జన్మించిన తన కుమారుడికి ఆస్పత్రిలో ఉన్నటువంటి ఇతర చిన్న పిల్లల తల్లులు తమ చను పాలను పిండి బాటిల్లో పోసి ఆ బిడ్డకు ఇచ్చే వారు.ఈ సందర్భంగా బిడ్డ తండ్రి చేతన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎంతోమంది మాతృమూర్తుల మానవత్వం వల్లే నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిపారు. అదేవిధంగా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళిన సమయంలో కూడా తన బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించడంతో చేతన్ ‘బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ ఉమెన్’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా తమ సమస్యను తెలిపాడు. దీంతో ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అదునికా ప్రకాష్ చేతన్ బిడ్డకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఇప్పటికీ వివిధ ప్రాంతాలలోని మహిళల దగ్గరనుంచి చనుబాలను ఆ బిడ్డకు అందిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు.