కరోనా బారిన పడి కోలుకుంటున్న వారితోపాటు పూర్తిగా కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వస్తున్న విషయం విదితమే. అయితే నిన్న మొన్నటి వరకు వైట్ ఫంగస్ కేసులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా యెల్లో ఫంగస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్దారించారు. కోవిడ్ బారిన పడిన ఓ వ్యక్తికి యెల్లో ఫంగస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో యెల్లో ఫంగస్ మొదటి కేసు నమోదైంది.
ఘజియాబాద్లో ఉన్న ఓ ఈఎన్టీ హాస్పిటల్లో యెల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా యెల్లో ఫంగస్ అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వ్యక్తి పరిశుభ్రతను పాటించకపోతే యెల్లో ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
యెల్లో ఫంగస్ బారిన పడిన వారిలో బద్దకం, ఆకలి లేకపోవడం లేదా తక్కువ ఆకలి ఉండడం, బరువు వేగంగా తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కోవిడ్ వచ్చిన వారు ఈ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇక యెల్లో ఫంగస్ వచ్చినవారికి యాంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపారు.