సాధారణంగా మనం వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తే భక్తులు స్వామివారి ఎదుట గుంజీళ్లు తీయడం చూస్తుంటాము. ఈ విధంగా స్వామివారి ముందు గుంజీళ్లు తీయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి చెల్లెలు పార్వతీదేవి అని చెప్తారు. ఈ క్రమంలోనే తన చెల్లెలు చూడటానికి విష్ణుదేవుడు కైలాస పర్వతం చేరుకుంటాడు.కైలాసం చేరిన విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పక్కనపెట్టి పరమశివుడు, తన చెల్లెలు పార్వతీదేవితో మాటలలో మునిగిపోయాడు.
విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఎంతో మెరుస్తూ అద్భుతంగా ఉండటంతో అది చూసిన బాల గణేశుడు సుదర్శనచక్రాన్ని మింగేశాడు.కొద్దిసేపు అనంతరం విష్ణు దేవుడికి సుదర్శన చక్రం ఎక్కడ పెట్టాననే విషయం గుర్తుకు రావడంతో కైలాస పర్వతం మొత్తం వెతికాడు. అప్పుడు వినాయకుడు సుదర్శన చక్రమా ఎక్కడుంది నేను ఎప్పుడో తినేసాను కదా అని అడగగా అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.
సుదర్శన చక్రం విష్ణుదేవుడు దుష్టులను సంహరించే ఆయుధం ఎలాగైనా దానిని ఇవ్వు అంటూ వినాయకుడిని బతిమాలారు.ఈ సమయంలోనే విష్ణుదేవుడు తన కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీస్తూ సుదర్శనచక్రాన్ని తనకు ఇవ్వవలసిందిగా కోరాడు.విష్ణు దేవుడు చేసిన పని ఎంతో చిలిపిగా ఉండటంతో బాల గణేశుడు గట్టిగా నవ్వాడు.ఇలా బిగ్గరగా నవ్వడంతో వినాయకుడి నోటిలోని సుదర్శనచక్రం బయటపడింది.అప్పటి నుంచి భక్తులు తమ కోరికలు నెరవేరాలంటే వినాయకుని ముందు గుంజిళ్ళు తీయడం ఒక ఆచారంగా వస్తోంది.