నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితే కత్తి మహేష్ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు బుధవారం పలువురిని ప్రశ్నించారు.
కత్తి మహేష్ కారు డ్రైవర్ సురేష్ను పోలీసులు నెల్లూరుకు పిలిపించి విచారణ చేపట్టారు. కోవూరు పోలీస్ స్టేషన్లో సురేష్ను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సురేష్ అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో ఏం జరిగింది ? అన్న వివరాలను పోలీసులకు వెల్లడించాడు.
నిద్ర సమయం కావడంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. ఆలోపే ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కత్తి మహేష్ నిద్రపోతున్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడిపోయారు. నేను సీటు బెల్ట్ పెట్టుకున్నా. అందువల్లే నాకేమీ కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డా. కంటెయినర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. అని సురేష్ తెలిపాడు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేష్ కంటికి గుచ్చుకున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసుల సహాయంతో మహేష్ను వెంటనే హాస్పిటల్లో చేర్చా. విచారణకు సహకరిస్తా. ఈ కేసులో నన్ను అనుమానించాల్సిన పనిలేదు.. అని సురేష్ అన్నాడు. కాగా పోలీసులు ఈ కేసులో మరికొంత మందిని విచారించనున్నారు.