కరోనా వల్ల గతేడాదిలోనే వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు తదితర పత్రాలకు వాలిడిటీని పెంచిన విషయం విదితమే. గతేడాది ఫిబ్రవరి 1 ఆ తరువాత ఎక్స్పైర్ అయిన పత్రాలకు పలు దఫాల్లో గడువును పెంచారు. మొదట జూలై 31వ తేదీ వరకు తరువాత సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 వరకు గడువు పెంచారు. అయితే ఆ గడువును తాజాగా మరోసారి పొడిగించారు.
వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్లతోపాటు వాహనాలకు చెందిన ఇతర పత్రాలన్నింటికీ జూన్ 30వ తేదీ వరకు గడువు పొడిగించారు. అంటే గతేడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆ తరువాత ఎక్స్పైర్ అయ్యే పత్రాలు కలిగిన వారికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఆయా పత్రాలు పనిచేస్తాయి. ఆలోగా వారు ఆ పత్రాలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీవో సేవలకు అంతరాయం కలుగుతుండగా మరోవైపు ఆర్టీవో కేంద్రాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. దీన్ని తగ్గించేందుకే ఎక్స్పైర్ అయిన పత్రాలకు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అందువల్ల వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.