టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆ రంగంలోకి సునామీలా ప్రవేశించింది. జియో దెబ్బకు కొన్ని టెలికాం సంస్థలు దుకాణాలను మూసేశాయి. ఇంకొన్ని విలీనం అయ్యాయి. తరువాత లైఫ్ పేరిట ఫోన్లను జియో లాంచ్ చేసింది. జియో ఫీచర్ ఫోన్లను కూడా జియో లాంచ్ చేసింది. అవన్నీ ఎంతో సక్సెస్ అయ్యాయి. అయితే త్వరలోనే ఓ నూతన ఆండ్రాయిడ్ ఫోన్ ను జియో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రిలయన్స్ జియో, ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్లు ఇప్పటికే ఓ బేసిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను రూపొందించే పనిలో పడ్డాయి. ఈ వివరాలను జియో గతంలోనే వెల్లడించింది. జియో ఫోన్ నెక్ట్స్ పేరిట ఓ బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ను లాంచ్ చేస్తామని కూడా గతంలోనే చెప్పారు. అయితే ఆ ఫోన్ను వచ్చే వినాయక చవితి రోజు మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఇక జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్ బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆ ఫోన్ కోసం ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను గూగుల్ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్ యాప్స్కు అందులో సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ రెండు మోడల్స్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బేసిక్ మోడల్ ధర రూ.5000గా ఉండనున్నట్లు సమాచారం. ఇంకొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసి ఇంకో మోడల్ను రూ.7000కు లాంచ్ చేస్తారని తెలుస్తోంది.
అయితే ఈ ఫోన్లను వాటి ధరలో 10 శాతం చెల్లించి కొనుగోలు చేసే అవకాశాన్ని జియో కల్పించనుందని తెలుస్తోంది. అంటే రూ.5000 మోడల్ ధర రూ.500కు, రూ.7000 మోడల్ ధర రూ.700కు వస్తాయి. మిగిలిన మొత్తాన్ని సులభమైన ఈఎంఐలలో చెల్లించే విధంగా కస్టమర్లకు ఆప్షన్లను అందిస్తారు. ఈ క్రమంలోనే జియో పలు ఫైనాన్స్ సంస్థలతో ఇందుకు గాను భాగస్వామ్యం అవనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ, పిరామాల్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ అషూర్, డీఎంఐ ఫైనాన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ ఫోన్లను తక్కువ ఈఎంఐలకే కస్టమర్లకు అందించనుందని సమాచారం. ఇక ఈ ఫోన్లలో ఉండే ఫీచర్ల గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆరంభంలో ఈ ఫోన్కు గాను మొత్తం 5 కోట్ల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.