Viral Video : వన్యమృగాలు ఉన్నాయి జాగ్రత్త అని.. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోంచి వెళ్లే దారుల వెంట ఈ హెచ్చరికలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సైన్ బోర్డులు లేకపోతే.. తెలియని వాళ్లు ఎవరైనా వన్యమృగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు పెడతారు. తెలిసో, తెలియకో మానవులు కూడా వన్య మృగాలకు ఎలాంటి హానీ తలపెట్టవద్దనే విజ్ఞప్తి ఈ హెచ్చరికల్లో నిగూడమై ఉంటుండటం విశేషం. అయితే, అటవీ శాఖ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ.. కొంతమంది యువత మాత్రం అటవీ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అడవిలో వన్యప్రాణులను ఇబ్బంది పెడుతుంటారు.
ఇంకొన్నిసార్లు వన్యప్రాణులను ఇబ్బందిపెట్టే క్రమంలో తమకు తెలియకుండానే ఆపద కొని తెచ్చుకుంటుంటారు. ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియో కూడా అలాంటిదే. పైన మీరు చూసిన దృశ్యం మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోనిది. ఒక పులి రోడ్డు దాటి వెళ్లేందుకు వస్తున్న క్రమంలో దానిని గమనించిన యువకులు అక్కడే ఆగి దానిని తమ కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తాము వెంటాడుతోంది ఒక పులిని అనే విషయం కూడా మర్చిపోయి దానికి అతి సమీపంలోకి వెళ్లబోయారు.

వారిలో ఒక యువకుడైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడొచ్చు. ఐతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్లో షేర్ చేస్తూ.. పులి మిమ్మల్ని వెంబడించాలనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దయచేసి ప్రమాదకరమైన క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించకండి. ఇలాంటి అత్యుత్సాహన్ని మానుకోండి అని యువతను హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
https://twitter.com/susantananda3/status/1577886776634449920