Viral News : సంక్రాంతి అంటేనే.. అత్తవారింటికి కొత్త అల్లుళ్లు వచ్చి హంగామా చేసే పండుగ. ఈ క్రమంలోనే కొత్త అల్లుడికి అత్తింటి వారు మర్యాదలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మర్యాదలు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మామూలే. ఇక గోదావరి జిల్లాల్లో అయితే అల్లుళ్లకు సంక్రాంతి పండుగ సమయంలో లభించే మర్యాదలు అన్నీ ఇన్నీ కావు.
సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరికి చెందిన ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో భోజనం పెట్టారు. ఆ భోజనంలో అనేక వెరైటీలు ఉన్నాయి. అన్నం, పులిహోర, బిర్యానీ.. వంటి వంటకాలను అత్తింటి వారు వండి అల్లుడికి వడ్డించారు.
30 రకాల కూరలు, 160 రకాల స్వీట్లు, 19 రకాల కారం పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీమ్లు, 35 రకాల కూల్ డ్రింక్స్, 15 రకాల కేకులు ఆ భోజనంలో ఉన్నాయి. వాటన్నింటితో ఆ కుటుంబం తమ అల్లుడికి భోజనం పెట్టింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ ఇలాగే కొందరు అత్తింటి వారు తమ అల్లుళ్లకు ఈ విధంగా అధిక సంఖ్యలో వంటకాలతో భోజనాలు పెట్టి వార్తల్లో నిలిచారు. దీంతో ఇప్పుడీ వార్త కూడా వైరల్ అవుతోంది.