Tollywood : కరోనా వల్ల ఇన్ని రోజులూ సినిమా షూటింగులు అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకోవడంతో దాదాపుగా పెద్ద సినిమాలన్నీ ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలకు విడుదల తేదీలు దొరకకపోవడంతో దర్శక నిర్మాతలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వారిలో ఆందోళన నెలకొంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన పలు సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. మరి ఆ సినిమాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల తేదీని ప్రకటించలేదు. అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి చిత్ర నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడం గమనార్హం.
వీటితో పాటు సాయిపల్లవి, రానా జంటగా నటించిన విరాటపర్వం, వెంకటేష్ మీనా జంటగా తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు. అలాగే లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన వరుడు కావలెను చిత్రం షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే ఈ సినిమాలను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు దర్శకులు వెల్లడించినప్పటికీ విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో, రారో.. సినిమాలు ఎలా నడుస్తాయో.. అన్న బెంగ వల్లే వారు చిత్రాలను విడుదల చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.