Gadwal : సాధారణంగా ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే ఎంతో మంది ఆడ పిల్లల పట్ల వివక్షత చూపిస్తూ వారిని కడుపులోనే కడ తేర్చడం లేదా పుట్టిన తర్వాత చెత్త కుప్పలు, మురికి కాలువల పాలు చేయడం మనం చూస్తుంటాము. అయితే గద్వాల్ జిల్లాలో వింత ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు వరుసగా కూతుర్లు పుడుతున్నారన్న నెపంతో ఆ భర్త ఏకంగా భార్యను కడతేర్చిన ఘటన గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన పల్లవి అనే యువతికి, గద్వాలకు చెందిన వెంకటేశ్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గత ఏడాది ఒక పాప జన్మించింది. ఈ క్రమంలోనే పల్లవి మరోసారి గర్భం దాల్చడంతో ఈసారి ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విధంగా వరుసగా ముగ్గురు కూతుర్లు పుట్టినప్పటికీ జీర్ణించుకోలేని వెంకటేష్ పల్లవి నిద్రిస్తుండగా ఆమెపై కోపంతో గొంతు నులిమి చంపాలని ప్రయత్నించాడు.
అయితే పల్లవి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఏమైందని ప్రశ్నించగా ఆమెకు ఫిట్స్ వచ్చాయని ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే పల్లవి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో బంధువులకు అతని మాటలపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నిర్వహించడంతో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారమే పల్లవిని హత్య చేశాడని తెలియడంతో వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం కూతుళ్లకు జన్మనిచ్చిందన్న కారణంగా భార్యను కడతేర్చాడని తెలియడంతో స్థానికులు వెంకటేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.