T20 World Cup 2021 : గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఈసారి ఓ ఐసీసీ టోర్నీలో తొలిసారిగా పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సులభంగా మ్యాచ్ను వదిలేసుకున్నారని అభిమానులు కోహ్లి అండ్ కో. పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత న్యూజిలాండ్తో మ్యాచ్లోన పరిస్థితిలో మార్పేమీ లేదు. పాకిస్థాన్తో మ్యాచ్లో కన్నా.. కివీస్తో మ్యాచ్లోనే భారత్ ఇంకా ఎక్కువ పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
అయితే చిన్న జట్లతో ఆడుతూ భారీ విజయాలను సాధిస్తున్నప్పటికీ భారత్ సెమీస్కు వెళ్తుందా ? అంటే ఇంకా సందేహమే. ఎందుకంటే.. భారత్కు ఉన్న ఒక్క మ్యాచ్ నమీబియాతో. ఆ టీమ్తో గెలిచినా.. ఆఫ్గనిస్థాన్తో జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోవాలి. అలా జరిగితేనే భారత్ ఎలాంటి అడ్డంకి లేకుండా సాఫీగా సెమీస్కు వెళ్తుంది. అయితే అంతటి బలమైన న్యూజిలాండ్ ను ఆఫ్గనిస్థాన్ ఓడిస్తుందా ? అంటే సందేహమే. కానీ గత రికార్డులను పరిశీలిస్తే.. యూఏఈలో తాను ఆడిన 12 టీ20లలో ఆఫ్గనిస్థాన్ కేవలం మూడు టీ20 లలో మాత్రమే ఓడింది.
ఇక న్యూజిలాండ్తో ఆఫ్గనిస్థాన్ మొదటి సారిగా టీ20లలో ఆడుతోంది. అందువల్ల ఆఫ్గనిస్థాన్ ఏ విధమైన ప్రదర్శనను ఇస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. గతంలో కివీస్, ఆఫ్గన్ టీమ్లు రెండు వన్డేలు ఆడగా.. వాటిల్లో న్యూజిలాండే గెలిచింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది టీ20 మ్యాచ్లు. పొట్టి క్రికెట్ కనుక సంచలనాలకు ఆస్కారం ఉంటుంది.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనే ఆఫ్గనిస్థాన్ వాళ్లను ముప్పు తిప్పలు పెట్టింది. అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. ఆఫ్గనిస్థాన్ చివరి వరకు పోరాడింది. చివరి ఓవర్లో పాక్ గెలిచి ఊపిరి పీల్చుకుంది. లేదంటే ఆఫ్గన్ చేతిలో పాక్ దారుణంగా ఓడిపోయి ఉండేది. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా న్యూజిలాండ్పై ఆఫ్గనిస్థాన్ అదే విధమైన ప్రదర్శన చేస్తుందా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే భారత అభిమానులే కాదు, భారత ప్లేయర్లు కూడా న్యూజిలాండ్పై ఆఫ్గనిస్థాన్ గెలవాలని కోరుకుంటున్నారు. ఆఫ్గనిస్థాన్ గెలిస్తేనే భారత్ సెమీస్కు వెళ్తుంది. కనుక ఆదివారం జరిగే ఆఫ్గనిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ అబుధాబిలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఇందులో గెలుపెవరిదో చూడాలి.