SS Rajamouli : పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన ఆకాశ్ మంచి హిట్ ఒక్కటి కూడా సాధించలేదు. ఈ క్రమంలో అతను కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘రొమాంటిక్’ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
అనిల్ పాడూరి దర్శకత్వంవహించిన ఈ సినిమాలో వాస్కోడిగామా అనే యువకుడిగా ఆకాశ్ మాస్ పాత్రలో నటించాడు. కేతికాశర్మ కథానాయికగా నటించింది. అక్టోబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్కు చెందిన స్టార్ సెలబ్రిటీల కోసం హైదరాబాద్లోని ఓ ప్రముఖ మాల్లో రొమాంటిక్ సినిమా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు.
రాజమౌళి దంపతులు, అనిల్ రావిపూడి, బాబీ, గోపిచంద్ మలినేని, మెహర్ రమేశ్, హరీష్ శంకర్, బొమ్మరిల్లు భాస్కర్, మోహన కృష్ణ ఇంద్రగంటి, గుణశేఖర్, అలీ, ఆనంద్ దేవరకొండ, విశ్వక్ సేన్ తదితర ప్రముఖులు ప్రీమియర్ షోను వీక్షించి చిత్రం బాగుందని కితాబిచ్చారు.
ప్రీమియర్ షో చూశాక రాజమౌళి స్పందిస్తూ ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ‘ముసలోడివై పోయావ్…నీకెం తెలుస్తుంది’ అని యూత్ అంతా గొడవపడతారేమోనని భయంగా ఉంది. దర్శకుడు సినిమాని బాగా తెరకెక్కించాడు. మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్, కేతికల నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమా అతడిని మరో మెట్టు పైకెస్తుందని అన్నాడు రాజమౌళి. ఇండస్ట్రీకి మరో మంచి నటుడు దొరికాడని కూడా అన్నారు.