Sirivennela : ఇన్నాళ్లూ అద్భుతమైన పదాలతో వెన్నెల ప్రసరింపజేసిన సిరివెన్నెల చీకట్లను మిగిల్చారు. సీతారామశాస్త్రి మరణాన్ని తెలుగు చిత్రసీమ తట్టుకోలేకపోతోంది. ఆ పాటసారిని, ఆయన పాటను ప్రాణంగా ప్రేమించిన వారందరి హృదయాలు.. అంతులేని వేదనతో సుడిగుండాలు అయ్యాయి. మాటలకందని విషాదం అందరిలోనూ ఉంది. అయితే సిరివెన్నెల చికిత్స నిమిత్తం కిమ్స్ హాస్పిటల్లో అయిన ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వం భరించి, తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సిరివెన్నెల కుటుంబ సభ్యులు ఓ లేఖను విడుదల చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి సిరివెన్నెల కుటుంబం మనస్పూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తుంది. నవంబర్ 30 ఉదయం 10గం.లకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి శాస్త్రి గారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని జగన్ గారు ఆదేశించినట్టుగా తెలియజేశారు. సిరివెన్నెల 30 సాయంత్రం 4.07 ని.లకు స్వర్గస్తులైనారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై ఆసుపత్రి ఖర్చులను భరిస్తూ మేము కట్టిన అడ్వాన్స్కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. సిరివెన్నెల గారి పట్ల ఇంతటి ప్రేమానురాగాలు చూపించి మా కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్ మోహన్ రెడ్డి గారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ధన్యవాదాలు సర్.. అంటూ సిరివెన్నెల కొడుకు లేఖలో తెలిపారు.
కాగా, కాసేపటి క్రితం సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.