ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరిట అత్యంత భారీ సాంకేతిక విలువలతో మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి చెందిన టీమ్ అంతా చిత్ర ప్రమోషన్లో భాగంగా ఫ్రెండ్షిప్ డే సందర్బంగా దోస్తీ పేరిట ఓ పాటను విడుదలచేశారు.
ఈ పాటను సిరివెన్నెల రాయగా.. ఇందులో స్నేహం గురించి వివరించారు. హేమచంద్ర పాట పాడాడు. ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్లతో పాటు కీరవాణీ, హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, యాజ్నీన్ నీజార్, విజయ్ ఏసుదాస్ కోరస్ పాడారు.
కాగా అభిమానుల భారీ అంచనాల నడుమ ఈ మూవీని అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీకి గాను ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అందుకనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది.
ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్లు నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.