Nagababu : ఏపీ అసెంబ్లీలో తన భార్యపై వైసీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేశారని, అనరాని మాటలు అన్నారని.. ఆరోపిస్తూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతం అయిన విషయం విదితమే. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడూ ఏడ్చింది లేదు. ఆయన ఎప్పుడూ గంభీరంగా కనిపించేవారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రత్యర్థులపై నిప్పులు చెరిగేవారు. అలాంటి చంద్రబాబు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు లైవ్లోనే గుక్క పెట్టి ఏడ్చారు. అయితే దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఇది చాలా అనాగరికమైన చర్య అని ఆయన న్నారు. సాటి మనుషులపై క్రూరత్వం ప్రదర్శరిస్తున్నారని, నీచ సంస్కృతికి దిగజారవద్దని నాగబాబు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.
చంద్రబాబు గారు మాకు ప్రత్యర్థి అయ్యి ఉండవచ్చు.. తెలుగుదేశం పార్టీ మాకు ప్రతిపక్షం అయ్యి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నేత ఇలా కన్నీటి పర్యంతం అయిన ఘటన నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది.. అని నాగబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన ఘటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో దుర్దినంగా ఆయన పేర్కొన్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు తలచుకుని బాధ పడలేక పడాలో తెలియని సందిగ్ధ దుస్థితి ఏర్పడిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకీ పరాకాష్టకు నిలయంగా మారుతుందని అన్నారు.
నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించు, నిలదీయు లేదా తప్పు వుంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి కానీ ఇలాంటి నీచ సంస్కృతీ కి దిగజారకండి… pic.twitter.com/CO8aoqxp2z
— Naga Babu Konidela (@NagaBabuOffl) November 19, 2021
ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో కించపరిచి తమని తాము హీనాతి – హీనమైన విలువలు లేని పురుగులుగా నిరూపించుకున్నారని నాగబాబు అన్నారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప.. ఒకరి కుటుంబాలను దూషించే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు.
గతంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా కుటుంబాన్ని ఇలాగే అనుచిత పదాలతో విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా.. ఆ బాధను అనుభవించిన మనిషిగా చెబుతున్నాను.. ఇది అనాగరికం మరియు సాటి మనుషుల పట్ల క్రూరత్వం. నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించు, నిలదీసి అడుగు. లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి. అంతేకానీ ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండి.. అని నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.