Kodali Nani : అసెంబ్లీలో వైసీపీ నేతలు చంద్రబాబుతోపాటు ఆయన సతీమణిని దూషించారనే ఆరోపణలతో చంద్రబాబు మీడియా ఎదుట కన్నీరు పెట్టుకోగా.. ఈ విషయంపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు.
మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. సినిమాల కోసం కుటుంబాన్ని.. నైతిక విలువలలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య నిలదీశారు. వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీఆర్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీఆర్ అంటే చాలా భయమని చెబుతూ.. అలాంటి వారిని కంట్రోల్ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు.
వర్ల రామయ్య వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ తమను ఎలా కంట్రోల్ చేస్తాడని అన్నారు. ఆయన చెబితే తామెందుకు వింటామన్నారు. నందమూరి కుటుంబమంటే సీఎం జగన్ కూ గౌరవమేనన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులన్నారు. శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆయన భార్య పేరును వాడుకుంటే నందమూరి కుటుంబం మద్దతిస్తుందని.. చంద్రబాబు కుట్ర పన్నారని.. ఆరోపించారు.