Kangana Ranaut : కంగనా రనౌత్.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో సుశాంత్ సింగ్ మరణంపై ఈమె బాలీవుడ్ మొత్తాన్ని విమర్శించింది. బంధుప్రీతి ఎక్కువని, కష్టపడి పైకి ఎదిగే వారిని తొక్కేస్తారని ఘాటు విమర్శలు చేసింది. అయితే కంగనా వ్యవహార శైలి చూస్తే ఆమె పరోక్షంగా బీజేపీ ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంటుంది.
కంగనా ఇటీవలే నాలుగోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకోవడంతోపాటు రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఇక తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె తన మనస్సులో ఉన్న విషయాలను మీడియతో షేర్ చేసుకుంది.
తాను ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో కష్టాలు పడ్డానని కంగనా చెప్పుకొచ్చింది. తనకు విజయం సాధించేందుకు 8-9 ఏళ్లు పట్టిందని, అయినా విడిచిపెట్టలేదని స్పష్టం చేసింది. ఇక నటిగా తాను ఎంతో సాధించానని చెప్పిన కంగన.. పెళ్లిపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, వైవాహిక జీవితాన్ని గడపాలని, పిల్లల్ని కనాలని ఉందని కూడా చెప్పింది. అయితే తనకు కాబోయే భర్త గురించి మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తానని చెప్పింది. మరి ఆ లక్కీ మ్యాన్ ఎవరో తెలియాల్సి ఉంది.