KA Paul : ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న సెన్సేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని అంటున్నారు. చరిత్రలో ఎన్నడూ కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని.. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రంలో.. గోండు వీరుడు కొమురం భీమ్గా ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్.. తండ్రి పాత్రలో అజయ్ దేవగణ్ నటించారు. అలాగే ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటించింది.

ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఎవరూ ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాపై కామెంట్ చేశారు. అసలు నాకు ఆర్ఆర్ఆర్ మూవీ తెలియదు, రాజమౌళి ఎవరూ.. అసలు ఆ హీరోలు ఎవరూ.. ఈ సినిమా చూడకండి.. టైం వేస్ట్. దేశానికి ఉపయోగపడే పనులు చేయండి.. అని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమకు తోచిన థంబ్ నెయిల్స్తో షేర్ చేశాయి. అందులో యూట్యూబ్ థంబ్ నెయిల్ స్క్రీన్ షాట్ షేర్ చేశాడు వర్మ. దీనికి.. నీ మొహం రా.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సినిమా, దర్శక ధీరుడు రాజమౌళిపై కేఏ పాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రశంసిస్తూ ఆర్జీవీ ఇటీవల ఆసక్తికర ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.