IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022వ ఎడిషన్ మరింత రసవత్తరంగా సాగనుంది. మరో రెండు కొత్త టీమ్లు వచ్చి చేరాయి. బీసీసీఐ సోమవారం సాయంత్రం రెండు కొత్త ఐపీఎల్ టీమ్లను ప్రకటించింది. లక్నో, అహ్మదాబాద్ టీమ్లను ఐపీఎల్లో చేరుస్తున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
లక్నో టీమ్ను ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ.7090 కోట్లకు సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ టీమ్ను రూ.5100 కోట్లకు సీవీసీ కాపిటల్ సొంతం చేసుకుంది. కాగా గోయెంకా గ్రూప్ గతంలో ఐపీఎల్కు చెందిన పూణె ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. 2 ఏళ్ల పాటు ఆ టీమ్ కొనసాగింది. తరువాత పలు కారణాల వల్ల ఆ టీమ్ను రద్దు చేశారు.
ఇక టీమ్ ల కోసం అదానీ గ్రూప్, గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, గ్లేజర్ ఫ్యామిలీ, అరబిందో, సీవీసీ కాపిటల్ భారీ ధరలకు బిడ్లను వేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు కోటక్ గ్రూప్, టొరెంట్ గ్రూప్లు కూడా బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అయితే డిసెంబర్ లో ఐపీఎల్ ఆటగాళ్లను మొత్తంగా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్లో అన్ని టీమ్ లలోనూ కొత్త ముఖాలు దర్శనమివ్వనున్నాయి.