Drushyam 2 : వెంకటేష్, మీనా నటించిన తాజా చిత్రం దృశ్యం 2 ను అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. మళయాళం సినిమా రీమేక్ అయిన దృశ్యం 2 ను అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చిత్ర నిర్మాత అయిన సురేష్ బాబుకు లీగల్ కష్టాలు వచ్చి పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సురేష్ బాబుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దృశ్యం 2 స్ట్రీమింగ్కు గాను ముందుగా నిర్మాత సురేష్ బాబు డిస్నీ వారితోనే సంప్రదింపులు జరిపారు. అయితే డీల్ కుదరని కారణంగా ఆ మూవీని అమెజాన్ ప్రైమ్కు విక్రయించారు. దీంతో అమెజాన్లో ఈ నెల 25వ తేదీన దృశ్యం 2 విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే చిత్ర స్ట్రీమింగ్ హక్కులను నిర్మాత సురేష్ బాబు ముందుగా తమకే విక్రయించారని.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆరోపిస్తోంది.
ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ తమకే ఉన్నాయని, ఆ హక్కులను సురేష్ బాబు తమకే విక్రయించారని డిస్నీ సంస్థ తెలిపింది. అయితే ఇతర స్ట్రీమింగ్ కంపెనీలకు ఆ హక్కులను అమ్మాలంటే తమతో చేసుకున్న అగ్రిమెంట్ను ముందుగా క్యాన్సిల్ చేసుకోవాలని.. కానీ సురేష్ బాబు అలా చేయలేదని, ఆయనకు మర్యాద, గౌరవం లేవని డిస్నీ సంస్థ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే తమను మోసగించారని ఆరోపిస్తూ డిస్నీ సంస్థ సురేష్ బాబుపై లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దృశ్యం 2 విడుదల ఆగిపోతుందా ? అన్న సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.