Cyber Fraud : సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వారికి ఎట్టి పరిస్థితిలోనూ ఓటీపీలు, గట్రా చెప్పకూడదని పోలీసులు ఓ వైపు ఎంత హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కొందరు ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. తక్కువ ధరకే మీల్స్ అంటే ఆశ పడి ఆర్డర్ చేశాడు. రూ.1 లక్ష మేర పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని ఖార్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఎన్డీ నంద్ (74) జనవరి 19వ తేదీన ఫేస్బుక్లో ఓ యాడ్ చూశాడు. అందులో కేవలం రూ.100 చెల్లిస్తే 3 మీల్స్ పొందవచ్చు అని ఉంది. దీంతో వెంటనే అందులో ఇచ్చిన కాంటాక్ట్ నంబర్కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు ఫోన్ లిఫ్ట్ చేసి ముందుగా రూ.10 చెల్లించాలని.. మిగిలిన రూ.90 లను మీల్స్ డెలివరీ సమయంలో క్యాష్ రూపంలో చెల్లించాలని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ వివరాలను నమ్మిన నంద్ వెంటనే తన క్రెడిట్ కార్డు వివరాలను అవతలి వ్యక్తికి చెప్పాడు. వారు ఆ కార్డుతో రెండు దఫాలుగా ట్రాన్సాక్షన్ చేశారు. ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా వారు అడిగినట్లు వారికి నంద్ ఓటీపీ చెప్పాడు. దీంతో 2 దఫాల్లో మొత్తం రూ.99,520 లను దుండగులు కాజేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నంద్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్ వర్డ్లను చెప్పకూడదని.. పోలీసులు మరోమారు హెచ్చరించారు.