Chinmayi : కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలో పలు రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ అవార్డులు వరించాయి. ఇక ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి నరసింహా రావుకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు పద్మ అవార్డును ప్రకటించారు.
గరికపాటి నరసింహారావు ఎక్కువగా పురాణాలను ఉదాహరణలుగా తీసుకుని వాటిని ప్రస్తుత ప్రజల జీవన విధానంతో పోల్చి ఉదాహరణలు చెబుతుంటారు. మధ్య మధ్యలో హాస్యం పండిస్తుంటారు. అందుకనే ఆయన చెప్పే ప్రవచనాలకు చిన్నా పెద్దా అందరూ ఆకర్షితులవుతుంటారు. చాలా మంది ఆయనకు అభిమానులయ్యారు. అయితే ఆయనకు పద్మశ్రీ ఇవ్వడంపై సింగర్ చిన్మయి స్పందించింది.
గరికపాటి గతంలో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు చెందిన వీడియోలను షేర్ చేసిన చిన్మయి ఆయనపై సెటైర్లు వేసింది. మహిళలు ఆ విధంగా దుస్తులను ధరిస్తే పురుషులు తట్టుకోలేరని గతంలో గరికపాటి అన్నారు. ఆ వీడియోలనే చిన్మయి షేర్ చేసింది.
అయితే చిన్మయి ఈ విధంగా చేయడంపై గరికపాటి అభిమానులే కాదు, నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం సరికాదని హితవు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిన్మయి ఓ కొత్త వివాదాన్ని కావాలని సృష్టిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.