Brahmanandam : నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా వేదికగా అన్స్టాపుబల్ విత్ ఎన్బీకే అనే టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబు, రెండవ ఎపిసోడ్ లో నాని ప్రేక్షకులను సందడి చేశారు. అయితే మూడవ వారం విజయ్ దేవరకొండ వస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ ఈ కార్యక్రమం ఆగిపోయింది.
బాలకృష్ణ భుజానికి సర్జరీ కావడం వల్ల కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి తరువాత రానున్న అతిథుల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు రాగా, తాజాగా ఈ కార్యక్రమానికి కమెడియన్ బ్రహ్మానందం కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదివరకే బ్రహ్మానందం.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బ్రహ్మానందాన్ని బాలకృష్ణ షో కు కూడా అతిథిగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.