మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటమిని ప్రకాష్ రాజ్ అంత ఈజీగా మరిచిపోయేలా కనిపించడం లేదు. ఆయన మొన్నీ మధ్యే ఎన్నికల రోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని కోరారు. అయితే ఎన్నికలతోనే తన పని అయిపోయిందని, సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే కోర్టు ద్వారా తెప్పించుకోవాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ బదులిచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వరకు వెళ్లిన ప్రకాష్ రాజ్ ఉసూరుమంటూ వెనక్కి వచ్చేశారు.
అయితే తాజాగా మా ఎన్నికల వివాదం ఊహించని మలుపు తిరిగింది. ఎన్నికల రోజు కేంద్రంలో రౌడీ షీటర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా వెల్లడించారు. ఆ రోజు రౌడీ షీటర్ కేంద్రంలో ఉన్నాడని చెబితే.. ఎన్నికల అధికారి ఖండించారు, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టంగా బయట పడింది.. అని ప్రకాష్ రాజ్ అన్నారు.
కాగా సదరు రౌడీ షీటర్ ను నూకల సాంబశివరావుగా గుర్తించారు. అతనిపై జగ్గయ్యపేట పీఎస్లో రౌడీ షీటర్గా కేసులు ఉన్నాయి. గతంలో ఓ హత్య కేసులోనూ అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను బెదిరింపులకు పాల్పడడం, సెటిల్మెంట్లు చేయడం వంటివి చేస్తుంటాడు. గతంలో నోట్ల రద్దు సయంలోనూ కోట్ల రూపాయలను తరలిస్తుండగా.. ఓ ఎస్సైని కారుతో ఢీకొట్టాలని ప్రయత్నం చేశాడు.
అయితే ఎన్నికల రోజున సదరు రౌడీ షీటర్ కేంద్రంలో ఏం చేస్తున్నాడని ? అతన్ని కేంద్రంలోకి ఎందుకు అనుమతించారని.. ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది.