Balakrishna : ఆంధ్రప్రదేశ్లో రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. భౌతిక దాడులతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ నేతల దాడుల్లో భాగంగా హిందూపూర్లోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీగా కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు దాడులకు దిగారని సమాచారం.
హిందూపూర్లో భారీగా వైసీపీ కార్యకర్తలు మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం. తన ఇంటిపై, కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో బాలకృష్ణ హిందూపూర్లో లేరని తెలుస్తున్నది. అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్న బాలయ్య హిందూపూర్కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు ఉన్న గ్లాస్ను పగలకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడి సీనియర్ ఎన్టీఆర్పై జరిపిన దాడిగా టీడీపీ కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. దీనిపై పార్టీలకు అతీతంగా పోరాడాలని అంటున్నారు. ఇలా వరుస దాడి ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ అభిమానులు పోస్టులతో అల్లాడిస్తున్నారు.