Manchu Vishnu : మంచు ఫ్యామిలీకి చూస్తుంటే బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు అనిపిస్తోంది. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణుతోపాటు ఆయన తండ్రి మోహన్బాబును ట్రోల్ చేశారు. తరువాత మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియాపై కూడా దారుణంగా విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా మంచు విష్ణు ఆఫీస్ నుంచి విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

జూబ్లీహిల్స్లోని సీబీఐ కాలనీలో మంచు విష్ణు కార్యాలయం ఉంది. అందులో బోరబండకు చెందిన యు.నాగశ్రీను అనే వ్యక్తి హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. దీంతోపాటు హెయర్ డ్రెస్సింగ్ మేకప్ సామగ్రిని కూడా తీసుకెళ్లాడు. వాటి విలువ రూ.5 లక్షలుగా ఉంటుందని మంచు విష్ణు ఆఫీస్ మేనేజర్ సంజయ్ తెలిపారు. ఈ క్రమంలోనే సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా ఈ నెల 17 నుంచే నాగశ్రీను కనిపించకుండా పోయాడు. అతను ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదు. దీంతోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న ఫిర్యాదు చేసినప్పటికీ ఈ విషయం మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నాగశ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.