కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి యాదృచ్ఛికంగానే జరిగినా సరే కొన్ని సందర్భాల్లో అలాంటి సంఘటనలు గురించి చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతాయా ? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. విశాఖపట్నంలోనూ సరిగ్గా అలాంటి ఆశ్చర్యపోయే, అబ్బురపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులు స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ తయారీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కిందట వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తెకు అప్పుడు ఏడాది వయస్సు ఉండగా, ఇంకో కుమార్తెకు 3 ఏళ్ల వయస్సు ఉండేది. అయితే వారిద్దరినీ తీసుకుని వారి బామ్మ భద్రాచలం ఆలయానికి బోటులో గోదావరి నదిపై బయల్దేరింది. కానీ దురదృష్టవశాత్తూ బోటు మునిగి అందులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు చనిపోయారు.
ఆ దంపతులకు చెందిన ఇద్దరు కుమార్తెలు, వారి బామ్మ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 15, 2019న చోటు చేసుకుంది. అయితే సరిగ్గా 2 ఏళ్ల తరువాత మళ్లీ అదే తేదీ రోజున తాజాగా అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ ఆడ పిల్లలే. ఆ రోజున ప్రమాదంలో చనిపోయిన వారే మళ్లీ ఇప్పుడు కవల పిల్లల రూపంలో తమకు పుట్టారని ఆ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ ఎంతో అద్భుతమనే చెప్పవచ్చు. నిజంగా అదృష్టం అంటే ఆ దంపతులదే అని చెప్పవచ్చు. చనిపోయారనుకున్న కుమార్తెలు మళ్లీ ఇలా కవలల రూపంలో జన్మించారని వారు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు..!