Andhra Pradesh : కొన్ని గంటలలో ఆమె పెళ్లి పీటలపై కూర్చుని వరుడి చేత మూడు ముళ్ళు వేయించుకోవాల్సి ఉంది. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ వధువు కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చింది.
మదన పల్లె మండలం తట్టివారి పల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతుల కుమార్తె సోనికకు అదే ఊరుకి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. నవంబర్ 14వ తేదీన వీరి పెళ్లి జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేశాయి. రాత్రి ఎవరి గదుల్లో వారు పడుకున్న తర్వాత పెళ్లి కూతురు సోనికా ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఉదయానికి వధువు కనిపించకపోవడంతో ఎన్ని చోట్ల వెతికినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా సోనిక గొల్లపల్లెకు చెందిన చరణ్ అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం వారిద్దరూ.. ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని కోరుతూ.. అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే ఆమె మేజర్ కావడంతో తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని.. వారిని విడదీయడానికి కుదరదంటూ.. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.