Allu Arjun : ఈ మధ్య కాలంలో చాలా మంది సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెడుతున్నారు. కరోనా వచ్చాక ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఈ క్రమంలో సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సమంత, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ వంటి వారు సేంద్రీయ వ్యవసాయాలు చేస్తుండగా, అల్లు అర్జున్ కూడా వారి జాబితాలో చేరబోతున్నారు. అల్లు అర్జున్ రీసెంట్గా రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని శంకర్పల్లిలో సందడి చేసిన విషయం తెలిసిందే.
శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని బన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఆయన శంకర్పల్లి తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. అభిమానులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు.
అయితే బన్నీ భూమిని కొనుగోలు చేసింది సేంద్రీయ వ్యవసాయం కోసమేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలువురు హీరోలు ఇదే పద్దతిని అవలంబిస్తుండగా, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.
అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.