Lakshadweep : ప్రధాని మోదీ ఇటీవలే లక్షద్వీప్కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై మాల్దీవ్స్కు చెందిన మంత్రులు కామెంట్స్ చేయడం, వెంటనే పెద్ద ఎత్తున భారత్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, మాల్దీవ్స్కు విమానాలు, అక్కడి హోటల్స్లో రూమ్లను భారతీయులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే దిగి వచ్చిన మాల్దీవ్స్ ప్రభుత్వం సదరు మంత్రులను సస్పెండ్ చేయడమే కాకుండా మోదీకి క్షమాపణలు కూడా చెప్పింది. అయినప్పటికీ మాల్దీవ్స్పై భారతీయులు ఆగ్రహంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్కు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్లే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు. ఇక ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మాల్దీవ్స్లాగే లక్షద్వీప్ కూడా ఎంతో సుందరమైన ప్రదేశం. ఇక్కడి సముద్రపు జలాలు, అద్భుతమైన బీచ్లు, కోరల్ రీఫ్, దీవులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది పర్యాటకులు లక్షద్వీప్ను సందర్శిస్తుంటారు కూడా. అయితే లక్షద్వీప్ను సందర్శించాలంటే ఎవరికైనా సరే.. ఆఖరికి భారతీయులు అయినా సరే ముందస్తు అనుమతి తప్పనిసరి. అక్కడికి వెళ్లాలంటే 3 నెలలు ముందుగా పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు వంటి వివరాలను తెలియజేయాలి. ఆ తరువాతే పర్మిట్ ఇస్తారు. ఇందుకు 3 నెలలు పడుతుంది. కనుక ఎవరైనా లక్షద్వీప్ను సందర్శించాలనుకుంటే ముందుగా ఈ పర్మిట్ను తెచ్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.

ఇక లక్షద్వీప్ను సందర్శించేందుకు చలికాలం చాలా అనువైన సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కనుక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. లక్షద్వీప్లో పర్యాటకులు అనేక యాక్టివిటీస్ చేయవచ్చు. స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.
లక్షద్వీప్కు చేరుకోవాలంటే కొచ్చి వెళ్లి అక్కడి నుంచి బోట్ లేదా విమానంలో వెళ్లవచ్చు. లేదా బెంగళూరు, చెన్నై నుంచి కూడా నేరుగా విమానాల్లో వెళ్లవచ్చు. లక్షద్వీప్లో మీరు డిజిటల్ ప్రపంచం నుంచి దూరంగా ఉండవచ్చు. ఎంతో సుందరమైన ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. దీంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడి బీచ్లు, నోట్లో నీళ్లూరించే ఫుడ్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. లక్షద్వీప్కు వెళ్లాలంటే పెద్దగా లగేజీ తీసుకెళ్లకండి. లైట్ వెయిట్గా వెళ్లండి. అలాగే స్విమ్ వేర్, సన్ స్క్రీన్ లోషన్స్, సన్ గ్లాసెస్ వంటివి తీసుకెళ్లడం మరిచిపోవద్దు.
లక్షద్వీప్లో పర్యాటకులకు బస చేసేందుకు అనేక రకాల కాటేజీలు, హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. అక్కడి ఎకో ఫ్రెండ్లీ కాటేజీలు లేదా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీచ్ హట్స్, లేదా ప్రైవేటు రిసార్ట్స్, హోటల్స్లోనూ పర్యాటకులు బస చేయవచ్చు. ఇలా లక్షద్వీప్ ను ఎవరైనా సరే సునాయాసంగా చుట్టి రావచ్చు. కానీ పైన తెలిపిన విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.