TDP Situation: ఏపీలో సీఎం జగన్ ప్రభంజనం మొదలైనప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే వైకాపాయే ఘన విజయం సాధిస్తూ వస్తోంది. ఇక తాజాగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైపీసీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఈ ఏడాది మార్చి 10నే జరిగాయి. అయితే కోర్టు వివాదాల కారణంగా ఫలితాలు తాజాగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీకి ఏకంగా 47 సీట్లు రాగా టీడీపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. జనసేన, బీజేపీలకు సీట్లు దక్కలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరులో టీడీపీ 68,175 ఓట్లో 42 శాతం ఓట్లను సాధించగా ఇప్పుడది 28 శాతానికి పడిపోయింది. తాజాగా ఆ పార్టీకి 37,414 ఓట్లు వచ్చాయి. అదే క్రమంలో వైకాపాకు 2019లో 44.73 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 56.43 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్యలను బట్టి చూస్తే టీడీపీ డౌన్ ఫాల్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి టీడీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను చురుగ్గానే పోషిస్తోంది. అనేక రకాల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రజలు ఆ పార్టీని ఓన్ చేసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. వినిపించడమే కాదు, ఎన్నికల ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ డౌన్ ఫాల్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముందు ముందు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.