Lord Shani Dev : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిని కర్మ ప్రధాత అంటారు. వ్యక్తులు చేసే పనులను బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడు. అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎక్కడ చూసినా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుంటాము. శనిదోషం, జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనెను సమర్పిస్తారు. అయితే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు ? దీని వెనుక కారణాలేమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటిని బంధించాడని చెబుతారు. శని దేవుడిని రావణుడు తన దుహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు. అదూ సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్లాడు. రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు.
మొత్తం లంకా దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి కానీ తలకిందులుగా వేలాడడం వల్ల శని దేవుడు విముక్తి పొందలేక శరీరం దెబ్బతింది. శనిదేవుడి బాధను తగ్గించడానికి హనుమంతుడు శని దేవుడి శరీరాన్ని నూనెతో మర్దనా చేసి నొప్పి నుండి విముక్తి కలిగించాడు. అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట. అప్పటి నుండి శని దేవుడికి నూనెను సమర్పించే సంప్రదాయం మొదలైంది. మరొక కథ ప్రకారం రామాయణ కాండలో శని దేవుడు తన బలం, ధైర్యం తలుచుకుని గర్వపడేవాడు. హనుమంతుని ధైర్య సాహాసాల గురించి తెలుసుకున్న శని దేవుడు ఆయనతో పోరాటానికి బయలుదేరాడు. శని దేవుడు హనుమంతుడిని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్లు మూసుకుని కూర్చుని శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్దానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు. అయితే ఇది సరికాదని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శని దేవుడికి హనుమంతుడు వివరించాడు.
కానీ శని దేవుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. యుద్దం చెయ్యాల్సిందేనని మొండి పట్టు పట్టాడు. దీంతో హనుమంతుడు యుద్దానికి దిగక తప్పలేదు. చివరికి శని దేవుడిని హనుమంతుడు తన తోకతో చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు. ఈ పోరులో శని దేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా గాయపడ్డాడు. తరువాత శని దేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతుడికి క్షమాపణలు చెప్పాడు. శ్రీరాముడు, హనుమంతుడి భక్తులను తాను ఎన్నటికి వేధించనని హామీ ఇచ్చాడు. హనుమంతుడు శనిదేవుడి శరీరానికి నూనె రాయడంతో బాధ తగ్గిందట. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో , నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలను తీరుస్తానని అని శని దేవుడు మాట ఇచ్చినట్టు పురాణాల్లో చెప్పబడింది. శని దేవుడుకి నూనె సమర్పించడం వెనుక ఉన్న కథనాలు.