వినాయక చవితి అంటే ముందుగా వినాయకుడి నైవేద్యంగా సమర్పించే ఉండ్రాళ్ళు గుర్తుకు వస్తాయి. స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రోజు స్వామివారికి ప్రత్యేక ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. మరి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్లను ఏవిధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
కావలసిన పదార్థాలు
- బియ్యపు రవ్వ – 2 కప్పులు
- నీళ్లు – 2 1/2 కప్పులు
- శనగపప్పు – 1 కప్పు
- జీలకర్ర – కొద్దిగా
- ఉప్పు – తగినంత
- నూనె – సరిపడా
తయారీ విధానం
ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర వేయాలి. ఆ తర్వాత అందులో నీటిని వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. బాగా మరుగుతున్న నీటిలో బియ్యపు పిండి, శనగపప్పు వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికిన తరువాత దించే ముందుగా కొద్దిగా నెయ్యి వేసి దించుకోవాలి. కొద్దిగా చేతికి నూనె రాసుకుని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు తయారైనట్లే. అయితే కొన్ని ప్రాంతాలలో కేవలం బియ్యపు పిండితో మాత్రమే ఉండ్రాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ విధంగా తయారు చేసిన ఉండ్రాళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.