శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు. ఈ మాసంలో మహిళలు పెద్దఎత్తున ఉపవాస దీక్షలు ఉంటూ వివిధ రకాల పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున సంకటహర చతుర్ధిని జరుపుకుంటారు. ప్రతి నెలా కృష్ణపక్షంలో పౌర్ణమి తరువాత వచ్చే మూడవ రోజును సంకటహర చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన సంకటహర చతుర్దశి రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సంకటహర చతుర్దశి వ్రతాన్ని 3, 5, 11, లేదా 21 నెలల పాటు నిర్వహిస్తారు. ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతం చేసేవారు వేకువ జామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిని వినాయకుడి ముందు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఆ తర్వాత మన మనసులో ఏదైనా బలమైన కోరిక కోరుకునీ 3 గుప్పిళ్ల బియ్యం, ఆ తర్వాత రెండు తమలపాకులు, రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మన కోరికలు తలుచుకుని మూట కట్టాలి.
ఈ విధంగా మూట కట్టిన బియ్యాన్ని వినాయకుడి ముందు ఉంచి ధూపం వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టాలి. అదేవిధంగా సంకటహర చతుర్దశి కథను చదివి ఆ రోజు సాయంత్రం వినాయకుడి ఆలయానికి వెళ్లి స్వామివారికి సమర్పించి మూడు లేదా 11, లేక 21 ప్రదక్షిణలు చేయాలి. ఈ క్రమంలోనే ఉదయం పూజ చేసిన బియ్యాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి వారికి సమర్పించి ఆ తర్వాత ఉపవాసం ఉన్నవారు ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆ వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.