ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో మనం మన చనిపోయిన పూర్వీకులకు, పెద్దవారికి పిండ ప్రదానాలను చేస్తూ వారి ఆత్మ శాంతించాలని వారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. మన పెద్దలకు ఎంతో పవిత్రంగా పూజలు చేసే ఈ రోజులలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి మహాలయపక్షంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
మహాలయ పక్షంలో మనం మన పెద్దవారికి పిండ ప్రదానాలు చేస్తాము కనుక ఈ 15 రోజులు ఏ విధమైనటువంటి శుభకార్యాలను జరపకూడదు. అదే విధంగా కొత్త వాహనాలను, కొత్త ఇంటిని కొనుగోలు చేయకూడదు. ఈ పదిహేను రోజులలో ఏ విధమైనటువంటి మాంసాహారాన్ని, ఉల్లిపాయ, వెల్లుల్లి కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా మహాలయ పక్షంలో ఉండే 15 రోజులను సంతాప దినాలుగా భావిస్తాము కనుక ఈ పదిహేను రోజులు మగవారు ఎలాంటి పరిస్థితులలో కూడా కటింగ్ చేయించుకోవడం, షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదు. అలాగే ఇంటిలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా నియమాలను పాటించడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయి.