హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆచార వ్యవహారాలతోపాటు పలు నమ్మకాలను కూడా ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఎలాంటి శుభకార్యాలు లేదా ముఖ్యమైన పనుల సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఆ కార్యానికి అశుభంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏదైనా శుభ కార్యాలు చేసే సమయంలో, శుక్రవారం, మంగళవారం వంటి రోజులలో నేలపై పసుపు, కుంకుమ పడిపోతే అరిష్టంగా భావిస్తారు. నిజంగానే ఇలా పసుపు ,కుంకుమ పడిపోతే అరిష్టం జరుగుతుందా.. అది అశుభానికి సంకేతమా ? అనే విషయానికి వస్తే..
సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు లేదా మంగళవారం, శుక్రవారం వంటి రోజులలో, మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా వారిని మన ఇంటి ఆడ బిడ్డతో సమానంగా భావించి వారికి పసుపు, కుంకుమలను ఇస్తాము. అదేవిధంగా శుభకార్యాలకు వచ్చిన వారికి కూడా పసుపు, కుంకుమ, తాంబూలం వాయనంగా ఇచ్చి పంపిస్తాము. ఈ క్రమంలోని నేలను సాక్షాత్తు భూదేవిగా భావిస్తాము. కనుక భూమాతకు కూడా మనం కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తుంటాము.
ఈ క్రమంలోనే ఏదైనా ముఖ్యమైన కార్యాలు చేసేటప్పుడు, శుభకార్యాలు చేసేటప్పుడు నేలపై పసుపు, కుంకుమ కింద పడితే మాత్రం కంగారు పడాల్సిన పని లేదని, అది అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. భూదేవి కూడా ఆడబిడ్డతో సమానం కనుక మనం చేసే కార్యంలో తాను భాగమవుతూ తనకి కూడా ఆ కార్యంలో పసుపు, కుంకుమలు ఇవ్వాలని కోరుకున్నప్పుడే ఈ విధంగా భూమిపై పసుపు కుంకుమ కింద పడతాయని, ఇలా పసుపు, కుంకుమ కింద పడితే సాక్షాత్తూ భూదేవికి మనం పసుపు కుంకుమను సమర్పించినట్లని పండితులు చెబుతున్నారు. కనుక ఏదైనా శుభకార్యాల సమయంలో పసుపు, కుంకుమ కింద పడితే ఆందోళన చెందాల్సిన పని లేదని, అది కూడా శుభానికి సంకేతం అని పండితులు తెలియజేస్తున్నారు.