ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ రావడంతో భక్తులు వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి పండుగలో నైవేద్యాలు ఎంతో కీలకమైనవి. స్వామివారి అనుగ్రహం పొందడం కోసం భక్తులు పెద్దఎత్తున స్వామివారికి వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే స్వామివారికి కుడుములు ఎంతో ప్రీతికరం. మరి స్వామి వారికి ఎంతో ఇష్టమైన కుడుములను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా.
కావలసిన పదార్థాలు
- శనగపప్పు – రెండు కప్పులు
- బెల్లం – ఒకటిన్నర కప్పు
- యాలకులు – 5
- గోధుమపిండి – ఒక కప్పు
- నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా శనగపప్పును కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. ఆ తర్వాత ఉడికిన శనగపప్పులో బెల్లం వేసి చిన్న మంటపై రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపప్పు బెల్లం, యాలకుల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా గోధుమపిండితో ఉప్పు లేకుండా చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన గోధుమపిండిని చిన్న పూరీలా తయారు చేసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు పూర్ణం వేసి, ఆ గోధుమ పిండి రేకులను కజ్జికాయల మాదిరిగా అల్లాలి. ఇలా చేసిన వాటిని బాగా మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన, వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారయినట్టే.