ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని.. ఆమె కుటుంబాన్ని బెదిరించి తమ పెళ్లికి వారిని ఒప్పించాలని.. తాను సూసైడ్ చేసుకున్నట్లు ఓ కట్టుకథ అల్లాడు. అయితే అతను చేసిన పనికి తీవ్ర మనస్థాపం చెందిన ప్రియురాలు నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన సక్కమ, అరుణ్లు ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ సక్కమ కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అరుణ్ ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి తన ఫ్రెండ్ గోపాల్తో కలిసి ఓ కట్టుకథ అల్లాడు. తాను సూసైడ్ చేసుకునేందుకు యత్నించానని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని ఓ కథ సృష్టించాడు.
ఈ క్రమంలోనే అరుణ్ పథకం ప్రకారం గోపాల్ తాను పోలీస్ అని చెప్పి సక్కమ కుటుంబ సభ్యులను కలిశాడు. వెంటనే అరుణ్, సక్కమ ల పెళ్లి ఫిక్స్ చేయాలని.. లేదంటే అరుణ్ ఆత్మహత్య యత్నానికి మీరే కారణమని కేస్ పెడతానని.. గోపాల్ హెచ్చరించాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న సక్కమ తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయట పడింది. అరుణ్ ఆత్మహత్యా యత్నం చేయలేదని, తన ఫ్రెండ్ గోపాల్తో కలిసి కట్టుకథ అల్లాడని తెలుసుకున్నారు. ఇక పోలీస్ అని చెప్పి సక్కమ కుటుంబ సభ్యులను బెదిరించినందుకు గాను గోపాల్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.