ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో దంపతులు కొందరు చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన అక్కడ కూడా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పూణెలోని అంబేగావ్ ఏరియాకు చెందిన గహినినాథ్ సరవడె (33)కి, ప్రతీక్ష (23) అనే మహిళకు 2019లో వివాహం అయింది. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తుండేవి. ఈ క్రమంలోనే తాజాగా అతను ఒక రోజు రాత్రి ఇంటికి భార్యకు చెప్పకుండా పానీ పూరీ పార్శిల్ తెచ్చాడు.
అయితే అప్పటికే వంట పూర్తి చేశానని, అదంతా ఎవరు తింటారని, అసలు తనకు చెప్పకుండా పానీ పూరీ ఎందుకు తెచ్చావని.. ప్రతీక్ష తన భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పోలీసులు గహినినాథ్ పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.