నవమాసాలు మోసి పేగుతెంచుకు పుట్టిన బిడ్డను ప్రతి తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఆ బిడ్డకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆ తల్లి అల్లాడి పోతుంది. అలాంటిది బిడ్డను 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి, ఉన్నఫలంగా ఆ బిడ్డ అర్ధాంతరంగా కన్నుమూస్తే ఆ తల్లి కడుపుకోత వర్ణనాతీతం. తన కళ్ళ ఎదురుగానే తన కొడుకు జీవచ్చవంలా పడి ఉంటే ఏ తల్లీ జీర్ణించుకోలేదు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. తన కన్న కొడుకు కళ్లెదుట జీవచ్చవంలా పడి ఉండడాన్ని చూడలేక ఆ తల్లి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అందరినీ కలిచి వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరు నగరంలోని విజయనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనం కేసులో మోహన్ గౌడ అనే 20 ఏళ్ల యువకుడిను విచారణకి పోలీసులు పిలవడంతో మోహన్ గౌడ్ భయపడిపోయాడు. ఈక్రమంలోనే బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్న మోహన్ మంగళవారం పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. అయితే అతను ఇంటికి వచ్చిన సమయంలో తన తల్లి ఇంట్లో లేదు. తండ్రి ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు.ఈ క్రమంలోనే లోపలికి వెళ్ళిన మోహన్ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎంతసేపటికీ తన కొడుకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపు బద్దలుకొట్టి చూడగా తన కొడుకు ఉరి వేసుకుని కనిపించడంతో ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన తన తల్లికి ఇరుగుపొరుగువారు జరిగిన సంగతి చెప్పడంతో ఆగమేఘాలపై ఆ తల్లి ఆసుపత్రికి చేరుకుంది. అయితే అప్పటికే తన కుమారుడు మరణించాడన్న వార్తను ఆ తల్లి జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి ఆవరణలో బయటకు పరిగెత్తుతూ ఎదురుగా వస్తున్న వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విధంగా ఒకే ఇంట్లో తల్లి, కొడుకు మరణించడంతో ఆ ఇంటి యజమాని కుప్పకూలిపోయాడు. కన్న కొడుకుపై ఉన్న ప్రేమతో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచి వేసింది.