భార్య భర్తల బంధం ఎంతో గొప్పదని చెబుతుంటారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటూ జీవితం ఎంతో అన్యోన్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ప్రస్తుత తరుణంలో భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు కొట్లాటలకు దారితీస్తూ.. క్షణికావేశంలో చంపుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఎంతోమంది ఇలా హత్యకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్మెన్గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని దుర్గా భవానీనగర్ను ఆనుకొని ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ బిల్డర్ వద్ద చత్తీస్ఘడ్కు చెందిన అటల్ పార్థి, రేఖా పార్థి అనే దంపతులు కొంత కాలం నుంచి అక్కడే పని చేస్తున్నారు. అయితే వీరి మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తుండేవి. దీంతో ఇరువురు పోట్లాడుకుని ఆ తరువాత మామూలుగా ఉండేవారు.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. అటల్ పార్థి తన భార్య రేఖను హత్యచేసి అదే కాంపౌండ్ గోడ పక్కన గడ్డిలో చుట్టి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.