పరస్త్రీపై ఉన్న వ్యామోహంతో కట్టుకున్న భార్యను కానరాని లోకాలకు పంపించాడు. వేరే మహిళపై ఆ తండ్రికి ఉన్న ప్రేమ తన బిడ్డల పాలిట శాపంగా మారింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా సదరు మహిళ ఎనిమిదేళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడింది. బాలుడికి మొత్తం వాతలు పెట్టిన ఘటన తమిళనాడులోని గుడియాట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
35 ఏళ్ల సెత్తు అనే వ్యక్తి ఈశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి కాపురంలో ఓ మహిళ చిచ్చు పెట్టింది. సెత్తు మరొక మహిళకు దగ్గరవటం జీర్ణించుకోలేని ఈశ్వరి తన భర్తను హెచ్చరించింది. అయినప్పటికీ తన భర్త పద్ధతిని మార్చుకోక పోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఈశ్వరి గత నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
తన భార్య మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చిన ఆ భర్త ఏకంగా తను ప్రేమించిన మహిళను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ముందు నుంచి ఈశ్వరి, ఆమె పిల్లలు అంటే గిట్టని వేణి ఆ పిల్లల పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించేది. ఈక్రమంలోనే వేణి ఎనిమిదేళ్ల కుమారుడిపై అతి దారుణంగా ప్రవర్తించింది. పసిమనసు అనే జాలి, దయ లేకుండా ఇష్టానుసారంగా బాలుడికి వాతలు పెట్టడంతో 8 ఏళ్ల కుర్రాడు గట్టిగా అరుచుకుంటూ తన పెద్దమ్మ దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పాడు.
ఈ క్రమంలోనే తన పెద్దమ్మ చికిత్స నిమిత్తం బాలుని ఆస్పత్రికి చేర్పించగా.. ఆపై వేణి, సెత్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.