భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే భార్య భర్తల మధ్య జరిగే గొడవలలో మూడవ వ్యక్తి కల్పించుకోకపోవడం ఎంతో మంచిది. కొన్ని రోజుల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్న తర్వాత భార్య భర్తలు ఇద్దరూ ఒకటవుతారు. అయితే తన కూతురు అల్లుడు గొడవ పడ్డారని వారికి సర్ది చెప్పడానికి వెళ్ళిన మామ దారుణంగా హత్యకు గురైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
షేక్ హఫీజ్ (47) సుభాష్చంద్రబోస్నగర్లో ఉంటూ క్యాబ్డ్రైవర్గా పని చేస్తున్నాడు. తన కూతురును ఆదిత్య నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఉమర్ కి ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పేవారు. ఈ విధంగా ఆదివారం సాయంత్రం వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకొని గొడవకు దారి తీశాయి.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో తన కూతురికి, అల్లుడికి నచ్చజెప్పడానికి వెళ్ళిన హఫీజ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా తన అల్లుడు ఉమర్ కత్తి తీసుకుని తన మామ మెడపై దాడి చేయడంతో హఫీజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.