రోజు రోజుకూ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఎన్నో ఎత్తులు వేసి ఎంతో మంది అమాయకులను తమ బుట్టలో వేసుకుని రూ.లక్షలకు లక్షలు డబ్బు పోగు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినప్పటికీ మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తూ మోసపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ బాలానగర్ పీఎస్ పరిధిలో ఆర సాయికుమార్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగం కన్నా ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం సాయికుమార్ నౌకరీ డాట్ కామ్ లో గత రెండు రోజుల క్రితం తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. సాయి కుమార్ కు ఓ మహిళ ఫోన్ చేసి తాను నౌకరి డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి, ఆమె పంపిన లింక్ కి కేవలం 10 వేల రూపాయలు మాత్రమే పంపించమని చెప్పింది.
ఈ క్రమంలోనే సాయి కుమార్ ఆ లింక్ ఓపెన్ చేసి ఆమెకు రూ.10,000 పంపించేలోగా ఏకంగా తన ఖాతా నుంచి అక్షరాలా రూ.25,314 మాయమయ్యాయి. ఈమేరకు డబ్బు డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన సాయికుమార్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలియడంతో ఒక బ్యాంకు ఉద్యోగి అయి ఉండి కూడా ఈ విధంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం విడ్డూరం అంటూ కామెంట్ చేస్తున్నారు.