అప్పుడే తన భార్య ఫోన్ చేసి ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందా అని తన భర్తను అడగగా.. మరో పది నిమిషాల్లో ఇంటికి వస్తానని ఆ భర్త సమాధానం చెప్పాడు. పది నిమిషాల్లో వస్తానన్న భర్త ఎంతసేపటికీ రాకపోగా పోలీసులు ఆమె ఇంటి తలుపు తట్టారు. ఏమైందో అని కంగారు పడుతున్న సమయంలో తన భర్త మృతదేహాన్ని ఇవ్వడంతో సదరు మహిళ అక్కడే కుప్పకూలిపోయింది ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
పని నిమిత్తం బయటకు వెళ్లిన భర్తకి భార్య ఫోన్ చేసి ఇంకా ఇంటికి రాలేదేమిటి ? ఆలస్యం అవుతుందా ? అని అడిగింది. అందుకు అతను.. బయలుదేరుతున్నానని, 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడు. అయితే అతను అక్కడి నుంచి బయలుదేరే సమయానికి పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో బస్ స్టాప్ సమీపంలో తన సైకిల్ పెట్టి అక్కడే ఉన్న హోర్డింగ్ బోర్డుకు చేయి ఆనించి నిలబడ్డాడు. అలా నిలబడిన వ్యక్తి ఉన్న పళంగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడ పడి ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వర్షం పడుతుండడం వల్ల హోర్డింగ్ బోర్డుకు విద్యుత్ ప్రసారం కావడం చేత అతడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. కేవలం మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ విధమైన ఘటన చోటుచేసుకుందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు.