తెల్లవారుజామున ఒక గడ్డివాము తగలబడటంతో అది చూసిన స్థానికులు పెద్ద ఎత్తున బిందెలతో నీటిని పోస్తూ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఈ విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అంతా సద్దుమణిగింది అనుకున్న క్రమంలో అక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గడ్డివాములో నాలుగు మృతదేహాలు కనిపించిన ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లా వట్టకొండన్వలసు గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
శనివారం తెల్లవారుజామున గడ్డివాము అంటుకొని పెద్దఎత్తున మంటలు రావడంతో స్థానికులు అందరూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఈ విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయడంతో వారు మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఆ బూడిదలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు కనిపించడంతో ఈ ఘటన అందరిలో తీవ్ర ఉత్కంఠతను కలిగిస్తోంది. అయితే ఆ మృతదేహలు అక్కడికి ఎలా వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఒకవేళ ఈ కుటుంబ సభ్యులు మొత్తం గడ్డివాము మంటలను అదుపు చేసే క్రమంలో పొరపాటుగా అందులో పడి చనిపోయారా.. లేక కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేకపోతే మరేవరైనా హత్య చేసి ఈ విధంగా చిత్రీకరించారా.. అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.