ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటితో మాట్లాడుతూ ఇప్పటికే అనేక సంఘటనల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. కొందరు అలాంటి సందర్బాల్లో చనిపోయారు కూడా. అయితే తాజాగా ఓ బాలుడు కూడా ఇలాగే చనిపోయాడు. బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతుండగా.. అది ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలలోకి వెళితే..
రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న చౌము అనే ప్రాంతంలోని ఉదయ్పురియా అనే గ్రామానికి చెందిన రాకేష్ నగర్ అనే బాలుడు శుక్రవారం బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో ఇంకో వ్యక్తితో కాల్లో మాట్లాడుతున్నాడు. ఉన్నట్లుండా సడెన్గా ఆ ఇయర్ ఫోన్స్ పేలాయి. దీంతో రాకేష్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా అతను బ్లూటూత్ పేలి గాయాలు అవడంతోపాటు కార్డియాక్ అరెస్టు వల్ల చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. అయితే ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటిలో మాట్లాడుతుండగా అవి పేలి కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ బ్లూటూత్ పేలి ఒకరు చనిపోవడం దేశంలో బహుశా ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.